చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్ పై దాడి పట్ల తీవ్రంగా స్పందించిన పవన్ కల్యాణ్

  • చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్ పై దాడి 
  • ఖండించిన పవన్ కల్యాణ్
  • రంగరాజన్ కు అండగా ఉండాలని జనసేన శ్రేణకుల నిర్దేశం
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ పై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో స్పందించారు.  రంగరాజన్ పై ఒక మూక దాడి చేసిందనితెలిసితీవ్ర ఆవేదనకు గురయ్యానని వెల్లడించారు.  రంగరాజన్ పై దాడి దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ఇది ఒక వ్యక్తిపై కాదు... ధర్మ పరిరక్షణపై జరిగిన దాడిగా భావించాలని స్పష్టం చేశారు.

"కొన్ని దశాబ్దాలుగా రంగరాజన్ ధర్మపరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు తపిస్తున్నారు... పోరాటం చేస్తున్నారు. రామరాజ్యం సభ్యులమని చెప్పి వెళ్లిన ఒక మూక రంగరాజన్ పై దాడి చేయడం వెనుక ఉన్న కారణాలు ఏమిటనేది పోలీసులు నిగ్గు తేల్చాలి. ఆ మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలి. ఈ దాడిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. 

సనాతన ధర్మ పరిరక్షణ కోసం రంగరాజన్ నాకు పలు విలువైన సూచనలు అందజేశారు. టెంపుల్ మూమెంట్ అనే కార్యక్రమం ఏ దశలో ప్రారంభించాల్సి వచ్చిందో తెలియజేశారు. హిందూ ఆలయాల నిర్వహణ, ధర్మ పరిరక్షణపై ఆయన ఎంతో తపన పడుతున్నారు. రంగరాజన్ పై జరిగిన దాడిని ప్రతి ఒక్కరం ఖండించాలి. చిలుకూరు వెళ్లి రంగరాజన్ ను పరామర్శించి, అండగా ఉంటామని ఆయనకు భరోసా ఇవ్వాలని జనసేన తెలంగాణ విభాగానికి దిశానిర్దేశం చేశాను" అని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

Pawan Kalyan
Rangararajan
Priest
Chilukuru Temple

More Telugu News